హైదరాబాద్: మల్కాజ్గిరి పార్లమెంటరీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సీహెచ్ మల్లారెడ్డి తన మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీల సమాచారాన్ని దాచిపెట్టారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యా దు చేసింది. ఎన్నికల అఫిడవిట్లో తన కాలేజీల వివరాలు ఇవ్వకుండా నిబంధనలు ఉల్లంఘించిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ను కలిసిన పార్టీ సీఈసీ సభ్యుడు శివకుమార్, ట్రేడ్ యూనియన్ విభాగం అధ్యక్షుడు బి.జనక్ ప్రసాద్, లీగల్ సెల్ కన్వీనర్ సి.నాగేశ్వర్రావు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను అందజేశారు.
వివిధ విద్యా సంస్థల అధినేతగా అందరికీ తెలిసిన మల్లారెడ్డి ఎన్నికల అఫిడవిట్లో మాత్రం ఆ వివరాలు వెల్లడించలేదని ఫిర్యాదులో వైయస్ఆర్సీపీ నాయకులు పేర్కొన్నారు. ఇది ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 నిబంధనల ఉల్లంఘనే అని, సమాచారాన్ని వెల్లడించకుండా దాచే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆయన 19 విద్యా సంస్థలకు వ్యవస్థాపక చైర్మన్గా, ఇతర హోదాల్లో ఉన్నారని పేర్కొన్నారు. అందులో 9 ఇంజనీరింగ్ కాలేజీలు, 3 ఫార్మసీ కాలేజీలు, 5 మేనేజ్మెంట్, బిజినెస్ కాలేజీలు, ఒక మెడికల్ కాలేజీ, పీజీ కాలేజీల్లో ఆయనకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలిపారు. ఆయనకున్న ఈ కాలేజీల పేర్లతో పాటు వివరాలను ఫిర్యాదులో పార్టీ నాయకులు పొందుపరిచారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం మల్లారెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.