వైఎస్సార్సీపీ ప్రచార హోరు..!

12 Nov, 2015 19:25 IST
హామీలు నెరవేర్చని అధికార పార్టీలకు బుద్ధి చెప్పండి..!
రాజన్న రాజ్యంతోనే సంక్షేమ పథకాల అమలు..!
ఫ్యాన్ గుర్తుకే మన ఓటు..!

వరంగల్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా వరంగల్ లో  ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ-బీజేపీల ప్రజావ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్, అలా చేయకపోగా...ఉన్న దళిత ఉపముఖ్యమంత్రిని అర్ధరాత్రి బర్తరఫ్ చేసి వారిని అవమానపర్చారని దుయ్యబట్టారు. ఇతర దళిత ఎమ్మెల్యేలున్నా వారికి ఎవ్వరికీ పదవి ఇవ్వకుండా ..అహంభావంతో  తనకు అనుకూలంగా ఉన్న వారికే కేసీఆర్ మంత్రి పోస్ట్ ఇచ్చారన్నారు.   

హామీలు నెరవేర్చని అధికార పార్టీలకు తగిన బుద్ది చెప్పేందుకు వరంగల్ ఓటర్లు ఈ ఉపఎన్నికను ఓ ఆయుధంగా ఉపయోగించుకోవాలని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. రుణాలు మాఫీ కాక, అప్పులు ఎక్కువై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా టీఆర్ఎస్, టీడీపీ ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదని రోజా మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ సకాలంలో అందక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారన్నారు.  డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామన్న పాలకులు ఇప్పటివరకు ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ , టీడీపీ-బీజేపీలను చిత్తుగా ఓడించాలన్నారు. బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేస్తుందన్న నమ్మకం లేదని, మిత్రద్రోహం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. 

ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉంటూ....వారిని అభివృద్ధి వైపు నడిపించాలన్న ఆకాంక్ష గల ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని  రోజా స్పష్టం చేశారు. నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన వైఎస్సార్ ఆశయాలతో రూపొందిన పార్టీ అని రోజా అన్నారు . ఉచితవిద్యుత్, ఫీజు రీయింబర్స్ మెంట్ , వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు, ఆరోగ్యశ్రీ , 108,104,  ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసిన  గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి  అని రోజా కొనియాడారు. అందువల్లే ఆప్రియతమ నేత చనిపోయి ఆరు సంవత్సరాలయినా  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారన్నారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలంటే  ఫ్యాన్ గుర్తుకు ఓటేసి..దళిత ఉద్యమాల్లో ఎంతోమందికి న్యాయం చేసిన నల్లా సూర్యప్రకాశ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని రోజా వరంగల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.