బంద్ కు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు
ఇప్పటికైనా చంద్రబాబు తీరు మారాలి
ఎన్ని కుట్రలు పన్నినా బంద్ విజయవంతం
హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం చేసిన బంద్ ద్వారా ప్రజలు రాష్ట్రానికి బంధనం కట్టారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. బంద్కు సహకరించిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా వామపక్షాలు, విద్యా సంఘాలు, ప్రజా సంఘాలకు ఆయన దన్యవాదాలు తెలిపారు. విద్యా, వ్యాపార వర్గాలు స్వచ్చందంగా బంద్ పాటించాయని ఆయన అన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
స్వచ్ఛందంగా బంద్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన మానుకొని ఈ బంద్ మీద దృష్టి పెట్టారు. విజయవాడలో మంత్రిమండలి సమావేశం పెట్టి మరీ స్వయంగా బంద్ పరిస్థితిని సమీక్షించారు. సెక్షన్ 144 పెట్టించి మరీ వేధించారు. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేయించారు. దీన్ని బట్టి ప్రత్యేక హోదా కు చంద్రబాబు అనుకూలమా.. లేక వ్యతిరేకమా ... అన్న సంగతి తేలిపోయింది. ఎన్ని రకాలుగా వేదించినా బంద్ విజయవంతం అయిందని వైఎస్ జగన్ అన్నారు.
హోదాపై అబద్దాలు
ప్రత్యేక హోదా వస్తే అనేక లాభాలు ఉన్నాయి. ప్రధానంగా రెండింటిని చెప్పుకోవచ్చు. హోదా వస్తే గ్రాంట్ల రూపంలో 90శాతం, అప్పుల రూపంలో 10శాతం నిధులు వస్తాయి. పరిశ్రమలకు సుంకాల మినహాయింపులు రావటంతో పారిశ్రామికాభివృద్ది జరిగి ఉద్యోగవకాశాలు పెరుగుతాయి. ప్రతీ జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఫైనాన్స్ కమిషన్, ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు అంటూ నాటకాలు ఆడుతున్నారు.
పోరాటం ఆపం
పార్లమెంటులో ప్రధానమంత్రి చేసిన ప్రకటనకే విశ్వసనీయత లేకపోతే ఎలా..! కేంద్రప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వచ్చిన చంద్రబాబు మాట మారుస్తున్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగించుకోవాలి. ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయాలి, లేదంటే కేంద్రం నుంచి మంత్రుల్ని పక్కకు ఉపసంహరించుకోవాలి. ఈ పోరాటాన్ని ఆపం, అసెంబ్లీలో కూడా నిలదీస్తామని వైఎస్ జగన్ అన్నారు.