విశాఖపట్నం/ శృంగవరపుకోట (విజయనగరం): ‘వైయస్ రాజశేఖరరెడ్డి మనసున్న మహామనిషి. ముఖ్యమంత్రిగా ప్రతి సంక్షేమ పథకాన్ని కుల, మతాలకు అతీతంగా అమలు చేశారు. ఆయన పాలనలో ప్రతి ఇంటికీ నలుగురైదుగురు లబ్ధిదారులు సంక్షేమ ఫలాలు పొందారు. ఆయన పాలనంతా సువర్ణయుగం. ఒక్క పన్ను కూడా రాష్ట్ర ప్రజలపై మోపని మహానీయుడు' అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ అన్నారు. విశాఖపట్నం లోక్సభా స్థానానికి గురువారం నామినేషన్ వేసిన శ్రీమతి విజయమ్మ శుక్రవారం పార్లమెంటరీ స్థానం పరిధి భీమిలి నియోజకవర్గంలోని పద్మనాభం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. విజయనగరం జిల్లా జామి, శృంగవరపుకోట, వేపాడ, ఎల్.కోట మండలాల్లో రోడ్షో నిర్వహించారు.
'రాష్ట్రాభివృద్ధి విషయంలో ఆయన తర్వాత అంతటి తెగువ శ్రీ జగన్మోహన్రెడ్డిలో ఉంది. చేయని నేరానికి జైలుకు వెళ్లాడు. ఎన్ని కష్టాలొచ్చినా నిరంతరం ప్రజల గురించే ఆలోచించాడు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా జగన్బాబు విలవిల్లాడిపోతాడు. గడిచిన నాలుగున్నరేళ్లుగా ఎండనకా, వాననక నిరంతరం ప్రజలమధ్యే తిరిగాడు. ప్రజల సమస్యలపై అనేకసార్లు స్పందించి జలదీక్ష, రైతుదీక్ష , ఫీజుపోరు వంటివెన్నో చేశాడు. వైయస్ఆర్ సువర్ణ యుగం జగన్తోనే సాధ్యం.. అందుకే ప్రజల కోసం పనిచేసే జగన్బాబును సీఎంను చేద్దాం’ అని శ్రీమతి వైయస్ విజయమ్మ ప్రజలకు పిలుపునిచ్చారు.
శ్రీమతి విజయమ్మ వెంట ఈ ప్రచారంలో వైయస్ఆర్సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ, ఎస్.కోట పార్టీ అసెంబ్లీ స్థానం అభ్యర్థి ఆర్.జగన్నాథం, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు తదితరులు పాల్గొన్నారు.