హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 8వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం హైదరాబాద్లోని కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అనునిత్యం ప్రజల తరఫున ఉద్యమాలు చేస్తూ అండగా నిలిచారన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతూనే ఉన్నాయని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైయస్ జగన్ ఒక్కరే అన్నారు. 2017 నవంబరు ఆరో తేదీ నుంచి వైయస్ జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ.. అధైర్య పడవద్దు నేనున్నానంటు భరోసా నింపుతున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి రావడం తథ్యమని, వైయస్ జగన్ సీఎం అయితే రాజన్న రాజ్యం వస్తుందని దీమా వ్యక్తం చేశారు.