హైదరాబాద్: ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా ఈ నెల 16న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గుంటూరులో యువభేరి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. ఈ మేరకు గుంటూరులో పార్టీ నాయకులు అంబటి రాంబాబు, మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డిలు మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ..నాడు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు తన స్వార్థం కోసం కేంద్రానికి తాకట్టు పెట్టారని మండిపడ్డారు.
హోదా కోసం మొదటి నుంచి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతున్నారని, ఇప్పటికే రాష్ట్ర బందులు, రాస్తారోకోలు, ధర్నాలు, ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారని తెలిపారు. యువత, విద్యార్థులను చైతన్యవంతం చేసేందుకు ఇప్పటికే తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ఏలూరు, కర్నూలు, కాకినాడ వంటి నగరాల్లో యువభేరి కార్యక్రమాలు నిర్వహించారన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న గుంటూరులో యువభేరి ఏర్పాటు చేశామన్నారు. యువత, విద్యార్థులు యువభేరిలో పాల్గొని హోదా నినాదాన్ని ఢిల్లీకి వినిపిద్దామని అంబటి పిలుపునిచ్చారు.