* ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించడం సిగ్గుచేటు
* ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునేలా రాజకీయాలు చేయాలి
* మంచి వ్యక్తిని కిరాతకంగా చంపడం అన్యాయం
* రామిరెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటా
* వేంపల్లిలో మీడియాతో మాట్లాడిన వైయస్ జగన్
పులివెందుల: ``గత 20 ఏళ్లుగా ఈ పల్లెల్లో ఎప్పుడూ ఇలాంటి సంఘటన చోటు చేసుకోలేదు. బాబు అండదండలు చూసుకుని టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. రాజకీయంగా అడ్డు వస్తున్నారని మంచి మనుషులను కిరాతకంగా చంపేస్తున్నారు. రాజకీయాలు చేయడం అంటే ఇదేనా? ఇలాంటి రాజకీయాలు చేస్తున్న చంద్రబాబును చూసి సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది`` అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ వర్గీయుల చేతిలో హత్యకు గురైన వేంపల్లి మండల ఉపాధ్యక్షుడు రామిరెడ్డి కుటుంబ సభ్యులను వైయస్ జగన్ పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చంద్రబాబు ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. రామిరెడ్డి ఎదుగుదలను సహించలేకనే టీడీపీ వాళ్లు ఆయనను హత్య చేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు అండదండలతో ఈ దురాగతానికి ఒడిగట్టారన్నారు. రాజకీయలు చేయడం అంటే ప్రజల గుండెల్లో స్థిర స్థానం ఎలా సంపాదించుకోవాలి అనే విధంగా రాజకీయాలు చేయాలని, ఇలా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించడం రాజకీయం కాదన్నారు. ఒక వ్యక్తి చనిపోతే ఇంత మంది బాధపడుతున్నారంటే రామిరెడ్డి ఎంత మంచివారో అర్థమవుతోందన్నారు. రామిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఈ పల్లె ప్రజల ఉసురు బాబుకు తగలడం ఖాయమని వైయస్ జగన్ అన్నారు.