గుంటూరు: కరువు, తాగునీటి ఎద్దడి మీద ప్రభుత్వ నిర్లిప్తత, నిర్లక్ష్యం నకు నిరసనగా ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సోమవారం ధర్నాలు చేపడుతోంది. ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్లలో ధర్నాకు దిగుతారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రోగ్రాముల విభాగం కోర్డినేటర్, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి రేపు ఉదయం 10 గంటలకు మాచర్లకు వైఎస్ జగన్ చేరుకోనున్నట్టు చెప్పారు. మాచర్ల ఎమ్మార్వో కార్యాలయం వద్ద వేలాది మంది ప్రజలతో కలిసి వైఎస్ జగన్ ధర్నా చేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.