విశాఖ: చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఏపీలో అభివృద్ధి పెద్ద గుండు సున్నా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
ప్రజా సంకల్ప యాత్ర 262వ రోజు విశాఖ నగరంలో కొనసాగుతోంది. శనివారం నగరంలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంజినీర్స్ డే వేడుకల్లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ..ఏపీలో ఎందరో మేధావులు, ఇంజినీర్లు ఉంటే.. చంద్రబాబు సింగపూర్ కంపెనీలకు పనులు అప్పగిస్తున్నారని మండిపడ్డారు. రాజధానికి ఇప్పటి వరకు ఒక్క ఇటుక కూడా పడలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో సాధించిన అభివృద్ధి గుండు సున్నా అని ధ్వజమెత్తారు. మన రాష్ట్రంలో ఉన్న పిల్లలకు ఉద్యోగాలు దొరకడం లేదని, మన వద్ద ఇంత ట్యాలెంట్ ఉంటే సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు పనులు అప్పగిస్తున్నారు. మనలో లేనిది ఏంటో? సింగపూర్ వాళ్లలో ఉన్నది ఏంటో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. పక్కనే కర్ణాటకలోని విధాస సభ, హైకోర్టు భవనాలు చక్కగా కనిపిస్తాయని, వాటిని కట్టింది మన ఇంజినీర్లే అన్న సంగతి చంద్రబాబుకు తెలియదేమో అన్నారు. ఇంతవరకు రాజధాని నిర్మాణంలో డిజైన్లు అంటూ ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు.తనతో పాటు నడవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వైయస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.