హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. ఇవాళ పార్టీ సీనియర్ నాయకులు వైవీ సుబ్బారెడ్డి రిట్ పిటిషన్పైనా హైకోర్టులో విచారణ మొదలు కాగా గతంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాఖ్యంతో కలిపి వైయస్ జగన్, వైవీ సుబ్బారెడ్డి పిటిషన్లను ఒకేసారి విచారిస్తామని హైకోర్టు తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసినట్లు హైకోర్టు వెల్లడించింది.
తనపై ఈనెల 25వతేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నానికి సంబంధించి రాష్ట్ర పోలీసుల పక్షపాత దర్యాప్తుపై ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ న్యాయపోరాటం ప్రారంభించారు. హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని ఏదైనా స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, విశాఖ సిటీ ఏసీపీ, 5వ టౌన్ పీఎస్ ఎస్హెచ్వో, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ డీజీపీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని వ్యక్తిగత హోదాలో ఇందులో ప్రతివాదిగా చేర్చారు.