విజయనగరంః ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం తర్వాత ప్రజా సంకల్పయాత్రలో భద్రత కట్టుదిట్ట చేశారు. వైయస్ జగన్ వెంట నడుస్తున్న వారికి ఐడీ కార్డుల విధానం ప్రవేశపెట్టారు. జగన్ను కలిసేందుకు వచ్చేవారిని పోలీసులు మెంటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులు ప్రత్యేకంగా 50 మందితో రోప్ పార్టీని కూడా ఏర్పాటుచేశారు. కిలోమీటర్లు దూరంలో ఉన్నవారిని కూడా గుర్తించే బాడి కెమెరాలు, వైయస్ జగన్ శిబిరంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రజలు వైయస్ జగన్ను కలవడానికి సెక్యూరిటీ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని పోలీసు అధికారులు తెలిపారు.
అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పున:ప్రారంభమైంది. గత నెల 25న విశాఖ ఎయిర్ పోర్ట్లో ఆయనపై హత్యాయత్నం జరగడం.. చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో జననేత పాదయాత్రకు స్వల్ప విరామం ప్రకటించిన విషయం తెలిసిందే. 17 రోజుల విశ్రాంతి అనంతరం వైఎస్ జగన్ తన 295వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం సాలూరు నియోజకవర్గం, పాయకపాడులో పున: ప్రారంభించారు.