- నాలుగు దఫాల్లో పొదుపు రుణాల మాఫీ- రైతులకు ప్రతి ఏటా రూ.12,500 ఇస్తాం
- 45 ఏళ్లకే పింఛన్ ఇస్తాం
చిత్తూరు: చంద్రబాబు దారుణపాలన అంతం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అన్నొస్తున్నాడని, అందరికి మంచి జరుగుతుందని మీ తోటి వారికి చెప్పాలని జననేత సూచించారు. 66వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం ఉదయం కొత్త వీరాపురం గ్రామంలో స్థానికులతో వైయస్ జగన్ మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని మండిపడ్డారు. రైతులకు నీళ్లు ఇవ్వని పరిస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విశ్వసనీయత, విలువలు ఉండాలన్నారు. ప్రజలందరికీ భరోసా ఇచ్చేందుకు పాదయాత్ర చేపట్టానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక పొదుపు సంఘాల మహిళల రుణాలను నాలుగు దఫాల్లో మాఫీ చేస్తానని హామీయిచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక అందరికీ మేలు చేస్తానని భరోసాయిచ్చారు. రైతులుకు ప్రతి ఏటా పెట్టుబడుల కోసం రూ.12,500 ఇస్తామని, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని, రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైఫరిత్యాల నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే మనందరి ప్రభుత్వం వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 45 ఏళ్లకే పింఛన్ ఇస్తామని, నెలకు రూ. 2000 వేలు పెంచుతామని హామీ ఇచ్చారు. ఇంకా ఆరోగ్యశ్రీని మెరుగుపరుస్తామని, ఫీజు రీయింబర్స్మెంట్, అమ్మ ఒడి పథకాలపై మహిళలకు వైయస్ జగన్ అవగాహన కల్పించారు. వైయస్ జగన్ హమీతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.