- వైయస్ జగన్ రాకతో పల్లెల్లో పండుగ వాతావరణం
- పుట్టపర్తి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేత పాదయాత్ర
అనంతపురం: అసలే కరువు జిల్లా, ఆపై పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాకతో ఒక్కసారిగా పులకించాయి. కొండకోనలు.. ఎర్రటి బీడు భూములు.. పేదరికంలో మగ్గుతున్న పల్లెలు రాజన్న బిడ్డను చూసి మురిసిపోయాయి. దారి పొడవునా వేలాది మంది ప్రజలు..పల్లెపల్లెలో బంతిపూల రోడ్లు...తమ అభిమాన నేతను చూడాలని, మనసారా ఆశీర్వదించాలని, అండగా నిలవాలని, తమ భవిష్యత్ ఆశాకిరణంతో కలసి అడుగులో అడుగు వేసి నడవాలని ప్రతీ పేదోడి గుండె తపించింది. అభిమాన నేతకు గుర్తుండిపోయే అభిమానాన్ని ప్రతీ పల్లె పంచింది. పేద ప్రజల అభిమానానికి జగన్ ముగ్దుడయ్యారు. తన ముందూ, వెనుక వేలాది మంది జనం దారిపొడవునా వెంట రాగా ఆయన తన పాదయాత్రను కొనసాగించారు. అనంతపురం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నెల 4వ తేదీన జిల్లాలోకి అడుగుపెట్టిన వైయస్ జగన్ నిన్నటి వరకు ధర్మవరం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇవాళ వైయస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర పుట్టపర్తి నియోజకవర్గం తనకంటివారి పల్లె గ్రామం నుంచి ప్రారంభమైంది. తమ అభిమాన నేతకు స్థానికులు హారతి పడుతూ, ఆత్మీయ స్వాగతం చెబుతున్నారు. దారిపోడువునా ప్రజల సమస్యలు వింటూ వైయస్ జగన్ భరోసా కల్పిస్తున్నారు.
మనం అధికారంలోకి వచ్చాక..
ఉన్నత చదువులు చదలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద విద్యార్థులకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ధైర్యం చెబుతున్నారు. ఉన్నత చదువులు చదవాలంటే రూ. లక్షల్లో ఫీజులున్నాయి. చంద్రబాబు మాత్రం ఫీజు రీయింబర్స్మెంట్ను రూ. 35 వేలకే పరిమితం చేశారు. మీ అందరి ఆశీస్సులతో మనం అధికారంలోకి వచ్చాక పూర్తి రీయింబర్స్మెంట్ ఇస్తాను అని మాట ఇ స్తున్నారు. పెద్ద పెద్ద కోర్సులు చదివే విద్యార్థులకు ఖర్చుల కోసం ఏటా రూ.20 వేలు ఇస్తాను. అదేవిధంగా మీ పిల్లలను బడికి పంపిస్తే ఏడాదికి రూ. 15 వేలు తల్లి ఖాతాలో జమ చేస్తాను. పెన్షన్ను రూ.1000 నుంచి రూ. 2 వేలకు పెంచేలా చర్యలు తీసుకుంటాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు పింఛన్ వయో పరిమితిని 45 ఏళ్లకు తగ్గిస్తాను. మరో వైపు జీవితాలని చిదిమేస్తున్న మద్యం రాకాసిని దశల వారీగా పూర్తిగా నిషేధిస్తానని వైయస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తున్నారు. దారి పొడువునా పంట పొలాల్లోకి వెళ్లి కూలీలు, రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. ఉద్యోగుల ఇబ్బందులు తొలగిస్తానని హామీ ఇస్తున్నారు. దేవుడి దయ, ప్రజల అండతో త్వరలో మన ప్రభుత్వం రాబోతుందని.. అధికారంలోకి రాగానే అన్నివర్గాల వారికి న్యాయం జరిగేలా చేస్తానని వైయస్ జగన్ మాట ఇస్తున్నారు. నిన్నటి రోజు యాత్ర యావత్తూ కొండకోనల మధ్య సాగింది.