మిర్చి రైతులతో వైయస్ జగన్ ముఖాముఖి
24 Mar, 2017 09:58 IST
గుంటూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం గుంటూరు మిర్చియార్డును సందర్శించారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఓ వైపు పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, మరోవైపు బ్యాంకులు రుణాలు చెల్లించడం లేదంటూ రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదని రైతులు వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. మిర్చికి కనీస మద్దతు ధర లభించడం లేదని, నకిలీ విత్తనాలు ఇచ్చారని, దళారులందరూ కుమ్మక్కయ్యారంటూ రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వైయస్ జగన్ మాట్లాడుతూ..పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, బ్యాంకులు రైతులకు కొత్త రుణాలు ఇవ్వక పోవడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇవ్వాల్సిన నాణ్యమైన విత్తనాలను కిలో రూ.లక్ష చొప్పున బ్లాక్ విక్రయిస్తున్నారని, మార్కెట్ లో కల్తీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణం మార్క్ ఫెడ్ ను రంగంలోకి దింపి రైతులను ఆదుకోవాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు.