నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గం
8 Dec, 2018 13:39 IST
అమరావతి: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకుపోతోందంటూ కోతలు కోసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగాలు అడిగినందుకు నిరుద్యోగులను బెదిరించడం దుర్మార్గమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్లో సీఎం ధోరణిని ఆయన తప్పుబట్టారు. ‘‘తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కోసం ఏపీ ప్రభుత్వం తరుఫున భారీ ప్రకటనలు ఇచ్చారు.
ఇళ్లు కట్టాం, పరిశ్రమలు పెట్టాం, అభివృద్ధిలో దూసుకుపోతున్నాం అని బాబు లేనిపోని కోతలు కోశారు. తిరుపతిలో గురువారం మా ఉద్యోగాలేవి అని అడిగిన డీఎస్సీ అభ్యర్థులతో ‘తమాషాగా ఉంది మీకు.. నిరుద్యోగుల ఒక్కరి కోసం పనిచేయడానికి సిద్ధంగా లేము.. తమాషా ఆటలు ఆడకండి.. బికేర్ ఫుల్’ అంటూ విరుచుకుపడ్డారు. ఎంతటి దుర్మార్గం?’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.