హైదరాబాద్ : సుప్రసిద్ధ ఇంజినీర్, నీటి పారుదల నిపుణులు టి.హనుమంతరావు మృతిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. హనుమంతరావు తెలుగువారిలో మహా మనుషుల కోవకు చెందినవారని, నీటి పారుదల, నీటి నిల్వ అంశాలమీద తన అభిప్రాయాలను రాగద్వేషాలకు అతీతంగా, నిర్మాణాత్మకంగా చెప్పేవారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీర్ ఇన్ చీఫ్గా, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారుగా, ఐక్యరాజ్యసమితి సలహాదారుగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనదని వైయస్ జగన్ అన్నారు. వ్యక్తిగా నిగర్వి, సౌమ్యుడు, పదవీ విరమణ తర్వాత కూడా నిస్వార్థ సేవలందించిన మహానుభావుడని, ఆయన మరణం దేశానికే తీరనిలోటు అని వైయస్ జగన్ తన సతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.