తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పడవ ప్రమాద ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై వివరాలు తెలుసుకోవడంతోపాటు, బాధితులకు సహాయం అందేలా చూడాలని, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ప్రజాసంకల్పయాత్ర శిబిరం నుంచే పార్టీ నాయకులకు ఆదేశాలు ఇచ్చారు.
ఈ ప్రమాద ఘటనపై పార్టీ తరఫున కమిటీని వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్లనాని, మాజీ ఎమ్మెల్యే బాలరాజు, జక్కంపూడి విజయలక్ష్మి , తూర్పుగోదావరి జిల్లా వైయస్సార్సీపీ యువజన నాయకులు అనంత్ ఉదయ్భాస్కర్లు ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలుసు కోవడంతో పాటు, బాధితులకు అండగా ఉంటూ, ప్రభుత్వం నుంచి బాధితులకు సహాయం అందేలా చూడాలని పార్టీ నాయకులకు వైయస్ జగన్ సూచించారు. తరచుగా బోటు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? గతంలో జరిగిన ఘటనల కారణాలు ఏంటి? ప్రభుత్వం ఎందుకు ఈ ప్రమాదాలను నియంత్రించలేకపోతోంది? తదితర అంశాలపై వివరాలు తెలుసుకోవాలని కమిటీ సభ్యులకు నిర్దేశించారు.