- చోడవరం నియోజకవర్గంలో అడుగుపెట్టిన వైయస్ జగన్
- ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన
- అడుగడుగునా ఘన స్వాగతం
విశాఖ: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. వైయస్ జగన్ వరుసగా నాలుగు నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని శనివారం ఐదో నియోజకవర్గంలో అడుగుపెట్టారు. నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, అనకాపల్లి నియోజక వర్గాల మీదుగా సాగి ఇవాళ చోడవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జననేత వైయస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. శనివారం ఉదయం జననేత 251వ రోజు పాదయాత్రను దర్జీనగర్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి మామిడి పాలెం క్రాస్, గంధవరం, దొడ్డుపాలెం క్రాస్, వెంకన్న పాలెం, గోవాడ మీదుగా అంబేరు పురం, గణపతినగరం మీదుగా చోడవరం వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. జననేత చోడవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
దారి పొడవునా మంగళహారతులు
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర శనివారం ప్రారంభమైంది. నైట్క్యాంప్ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు. జననేత వెంట అడుగులో అడుగు వేసేందుకు వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దారి పొడవునా ప్రజలు తమ బాధలు వైయస్ జజగన్కు చెప్పుకుంటున్నారు. వారికి మంచి రోజులు వస్తాయని భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.