ఢిల్లీ: అవిశ్వాసం ప్రవేశపెట్టి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన ఏకైక వ్యక్తి వైయస్ జగన్మోహన్రెడ్డి అని వైయస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. వైయస్ఆర్ సీపీ అవిశ్వాసంతో దేశంతో ప్రకంపనలు వస్తున్నాయన్నారు. అవిశ్వాస తీర్మానం దండగ అన్న చంద్రబాబుతో అవిశ్వాసం పెట్టించిన వ్యక్తి వైయస్ జగన్ అన్నారు. పార్లమెంట్ ఆవరణలో పెద్దిరెడ్డి మిథున్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ అవిశ్వాసం, ఎంపీల రాజీనామా అంశాన్ని తప్పుదోవ పట్టించడానికి చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారన్నారు. నాలుగు సంవత్సరాలుగా నిద్రపోయిన చంద్రబాబు ఇప్పుడు మేమే ఉద్దరిస్తామన్నట్లుగా డ్రామాలు ఆడుతున్నాడని ధ్వజమెత్తారు. కుట్రలు, కుతంత్రాలతో టీడీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతామంటే జైల్లో పెడతామన్న చంద్రబాబు ఇప్పుడు స్వరం మార్చి హోదా అంటూ మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబు మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలెవరూ లేరన్నారు.