అమరావతి: ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ మరణం తెలుగుజాతికి తీరని లోటు అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశ వ్యాప్తంగా ఆయనకు అసంఖ్యాకంగా అభిమానులున్నారని, దశాబ్దాలుగా ఆయన వందలమంది మిమిక్రీ కళాకారులకు మార్గదర్శనం చేశారని వైయస్ జగన్ గుర్తు చేశారు. అనేక భారతీయ భాషల్లో స్వరానుకరణ, హాలీవుడ్ నటుల స్వరాలను కూడా అలవోకగా పలికించటంతో పాటు హాస్యం పండించటం ద్వారా ఆయన కోట్ల హృదయాలకు చేరువయ్యారని వైయస్ జగన్ కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.