- చిన్నవాల్తేరు నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం- విశాఖ నగరంలో అడుగడుగునా ఘన స్వాగతం
విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలుస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో అనంతవాహినిలా సాగిపోతోంది. జననేత వెంట నగరం నడుస్తోంది. మహానగరం నడిబొడ్డున జన ప్రవాహం పరవళ్లు తొక్కుతోంది. అభిమానం పూలవర్షమై కురుస్తోంది. దారిపొడవునా జగన్నినాదం మార్మోగుతోంది. సంకల్పధీరుడికి సలాం కొడుతోంది. నీవే మా భవిత అంటూ యువత నినదిస్తున్నారు. అక్కచెల్లెమ్మలు తమ కష్టాలను చెప్పుకుంటూ ఊరట పొందుతున్నారు. మంగళవారం ఉదయం జననేత 260వ రోజు పాదయాత్రను చిన వాల్తేరు కనకమ్మ గుడి సమీపం నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి చిన వాల్తేరు, ఈస్ట్ పాయింట్ కాలనీ, బీచ్ రోడ్ వరకు రాజన్నబిడ్డ పాదయాత్ర కొనసాగనుంది. విశాఖ ఫంక్షన్ హాలులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్లతో జరిగే సమావేశంలో జననేత పాల్గొంటారు.
దారి పొడవునా మంగళహారతులు
అడుగు ముందుకు పడనీయని అభిమానం, కాలు కదపనీయని అనురాగం. దారి పొడవునా మంగళహారతులు. ప్రజా సమస్యల తోరణాలు, వినతులు, విజ్ఞప్తులతో జననేత పాదయాత్ర మంగళవారం ప్రారంభమైంది. నైట్క్యాంప్ వద్ద రాజన్న బిడ్డను చూడటానికి, మాట్లాడటానికి, పాదయాత్రలో తాము భాగం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల, ప్రజలు ఉదయం నుంచే పెద్దఎత్తున తరలివచ్చారు. దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగుడుగునా సమస్యలు చెప్పుకున్నారు. వారికి భరోసా కల్పిస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు,