వైయస్ఆర్ జిల్లా: సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల విద్యార్థిని వెంకటేశ్వరి మృతిపై విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని వైయస్ఆర్సీపీ ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. కస్తూర్భా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వెంకటేశ్వరి నిన్న ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడంపై ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకటేశ్వరి మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వైయస్ఆర్ జిల్లాలో వరుసగా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. కడపలోని మౌంట్ఫోర్ట్ హైస్కూలు విద్యార్థి చరణ్రెడ్డి అనుమానాస్పదమృతి మిస్టరీ వీడక ముందే సింహాద్రిపురం కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని వెంకటేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడటంతో బాధాకరమన్నారు. వెంకటేశ్వరి మృతిపై అనేక అనుమానాలున్నాయని.. వెంటనే విచారణ జరిరిపించి నిజాలు నిగ్గుతేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.