విద్యాబోధనతో పాటు మంచి బుద్ధులు నేర్పాలి
9 May, 2017 18:37 IST
అడ్డతీగల: ప్రాథమిక స్థాయిలో విద్యార్ధులకు విద్యాబోధనతో పాటు మంచి బుద్ధులు నేర్పాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఉపాధ్యాయులకు సూచించారు. అడ్డతీగల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు ఏడు రోజులుగా ఇస్తున్న వృత్తాంతర శిక్షణ ముగింపు కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు విద్యార్థుల్లో మంచి నడవడిక అలవడాలంటే ప్రాథమిక పాఠశాలల స్థాయిలోనే తర్ఫీదు తప్పనిసరి అన్నారు. అంకితభావంతో పనిచేసి భావిభారత పౌరులుగా బాల్యం నుంచే విద్యార్ధులను తీర్చిదిద్దాలని ఆమె ఆకాంక్షించారు.