పచ్చచొక్కాల ఇసుకమాఫియా
1 Apr, 2016 17:32 IST
గుంటూరు(బెల్లంకొండ): మండలంలోని కృష్ణా తీర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. పోలీస్, రెవెన్యూ అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఉదాసీనత, అధికార పార్టీ నేతల దందా... వెరసి ఇసుక అక్రమ రవాణాకు అడ్డు అదుపు లేకుండాపోతుందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. కాంట్రాక్టర్ల అవతారమెత్తిన పచ్చచొక్కా నేతలు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే చందంగా... సామాన్యుల పేరుతో ఉచితం మాటున తోడేళ్ల మాదిరిగా ఇసుకను దోచుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా నదీ గర్భాలను తోడేస్తు, పగలు నదీ ప్రాంతం నుంచి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా డంప్ ప్రాంతాలకు చేర్చి రాత్రి సమయంలో అక్కడి నుంచి అక్రమ రవాణా చేస్తున్నారు. పోలీసులు సైతం నిమ్మకునిరెత్తినట్లు వ్యవహారిస్తుండడంతో అడ్డదారుల్లో ఇసుకను తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.
మండలంలోని కృష్టానదీ తీర ప్రాంతాలయిన బోధనం, కేతవరం, కోళ్లూరు, చిట్యాలలో గల తీరాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. టీడీపీ నేతలు దగ్గరుండి ఇసుకను తరలిస్తుండడంతో సంబంధిత అధికారులు అక్రమ తరలింపు ప్రాంతాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక తరలింపును అరికట్టాలని పలువురు కోరుతున్నారు.