బాబుకి భయం ఎందుకు..వాసిరెడ్డి పద్మ

7 May, 2016 13:32 IST

హైదరాబాద్ః రాష్ట్రానికి హోదా ఇవ్వం, ఎలాంటి రాయితీలు ఇవ్వమంటూ కేంద్రం తెగేసి చెబుతుంటే...పోరాడకుండా చంద్రబాబు ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నారో సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతుంటే...కేంద్రాన్ని ఎవరూ విమర్శించవద్దంటూ చంద్రబాబు మాట్లాడడం దారుణమన్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం పోరాడరు, పోరాడేవాళ్ళ కాళ్లు పట్టుకొని లాగుతున్నారని బాబుపై ధ్వజమెత్తారు. ఏపీ ప్రజల ప్రాణవాయువైన హోదా గురించి ఎందుకు కేంద్రాన్ని నిలదీయడం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అరెస్ట్ చేస్తారని భయపడుతున్నారా బాబు అంటూ మండిపడ్డారు. మీ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెడితే ప్రజలు చూస్తూ ఊరుకోరని బాబును హెచ్చరించారు. హోదాపై ఉమ్మడిగా ఉద్యమం కొనసాగించేందుకు ముందుకు రావాలన్నారు.