రైతు సంక్షేమం ఏదీ?
ఉరవకొండ: చంద్రబాబు నాయుడి పాలనలో రైతు సంక్షేమం లేదని, పూర్తిగా అడుగంటిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. అనంతలో 8 లక్షల ఎకరాల సాగుభూమి, లక్ష ఎకరాల ఆర్టికల్చర్ భూమి ఉందని తొమ్మిది లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే కేవలం వెయ్యి ఎకరాలు మాత్రమే ద్రాక్ష సాగవుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో రూ. 3.5 లక్షలు సబ్సీడీ ఇస్తుంటే ఏపీలో సబ్సీడీనే లేదన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తామని జలయజ్ఞం చేపట్టారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సాగునీరు ప్రాజెక్టులన్నీ వైయస్ఆర్ చేపట్టినవేనని పేర్కొన్నారు. చంద్రబాబు రెయిన్ గన్లతో కరువును జయించామని చెబుతున్నారని, ఎక్కడ జయించారో చెప్పాలని డిమాండ్చేశారు. వేరు శనగలు వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రాయలసీమలో రైతాంగం పొట్టచేత పట్టుకొని వలసలు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని, ఇతర రాష్ట్రాలకు వెళ్లి అడుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది అంటే అది బాబు వల్లనేనన్నారు. అనంతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, 1260 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 160 మంది చనిపోయారని అబద్ధాలు చెబుతున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రతి రైతు కుటుంబానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.