ఇళ్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా-ఎమ్మెల్యే ఆర్కే
29 May, 2016 11:47 IST
గుంటూరు: ఏపీ రాజధాని అమరావతికి రోడ్ల విస్తరణ పేరుతో ఇళ్లను తొలగించడం సరైన పద్దతి కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరి మండల పరిధిలోని ఎర్రబాలెం గ్రామస్తులు తమ ఇళ్ల తొలగింపులపై రామకృష్ణారెడ్డికి విన్నవించారు. ఉన్న ఇళ్లను తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లాల్లో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎమ్మెల్యే ఇళ్ల తొలగింపుపై న్యాయపోరాటం చేస్తానని వారికి హామీనిచ్చారు. అవసరమైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దఎత్తున ఆందోళనలు సైతం చేసి బాధితులకు అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆర్కే పేర్కొన్నారు.