- ప్రత్యేక హోదా కోసం చివరిదాకా పోరాడతాం- వైయస్ఆర్సీపీ ఎంపీలు
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తొలిగా అవిశ్వాస తీర్మానం పెట్టింది వైయస్ఆర్ సీపీనే అని పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. దేశం మొత్తానికి ఇవాళ ఏపీకి హోదా, కేంద్రంపై అవిశ్వాసం అంశాలే కీలకంగా మారాయని, ఒకరకంగా పార్లమెంట్లో ఎజెండాను నిర్ణయించింది వైయస్ఆర్సీపీనే అని పేర్కొన్నారు. బుధవారం లోక్సభ వాయిదా అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించగల ఏకైక పార్టీ వైయస్ఆర్సీపీనే అని, ఉద్యమాన్ని నాలుగేళ్లుగా సజీవంగా నిలిపిన ఘనత వైయస్ జగన్దేనని స్పష్టం చేశారు. హోదా సాధనలో భాగంగా పార్లమెంట్లో తుది వరకూ పోరాడుతామని చెప్పారు. సోమవారం అవిశ్వాసంపై చర్చ జరుగుతుందన్న నమ్మకం మాకుందని తెలిపారు. ఇప్పటికే చాలా పార్టీలు అవిశ్వాసానికి మద్దతుగా నిలిచాయని చెప్పారు. ఒకవేళ సభ నిరవధికంగా వాయిదా పడితే, మరుక్షణమే మా పార్టీ ఎంపీలం రాజీనామాలు సమర్పిస్తామని మేకపాటి రాజమోహన్రెడ్డి వెల్లడించారు.
తుది దాకా పోరాడుతాం: వైవీ సుబ్బారెడ్డి
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో తుదిదాకా పోరాడుతామని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం అవిశ్వాసంపై చర్చ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. సమావేశాల చివరిరోజు దాకా పోరాడాలనుకుంటున్నామని చెప్పారు. ఒకవేళ మధ్యలోనే సభ నిరవదికంగా వాయిదాపడితే అప్పటికప్పుడే రాజీనామాలు చేస్తామని స్పష్టం చేశారు.