షర్మిలకు శంషాబాద్‌లో ఘన స్వాగతం

5 Aug, 2013 10:41 IST
హైదరాబాద్, 5 ఆగస్టు 2013:

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న‌ శ్రీమతి షర్మిలకు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు, తన మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మ‌తో కలిసి ఆమె విశాఖపట్నం నుంచి విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్‌  విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రమంలో శ్రీమతి షర్మిలకు‌ వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.

హోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తమ అభిమాన రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులకు శ్రీమతి షర్మిల అభివాదం చేశారు. ఈ సందర్భంగా‌ అభిమానులు, పార్టీ శ్రేణులు జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్నినాదాలతో శంషాబాద్ ‌విమానాశ్రయం మార్మోగిపోయింది.

చరిత్రలో మరే మహిళా సాహసించని రీతిలో శ్రీమతి షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ 3,112 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయత్ర చేసి, ఒక మహిళగా వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయ చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేసిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి‌ శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పాదయాత్ర సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో శ్రీమతి షర్మిల మోకాలికి గాయం కావడంతో కొంతకాలం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. మొత్తం 230 రోజులలో ఆమె నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తిచేశారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజకవర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో శ్రీమతి షర్మిల పాదయాత్ర చేశారు.