తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య పోరు

26 Oct, 2013 14:39 IST
హైదరాబాద్, 26 అక్టోబర్ 2013:

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ‌రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణ అన్నారు. తెలుగు జాతిని‌ అడ్డగోలుగా విడగొట్టేందుకు జరుగుతున్న దుష్ట యత్నాలను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగు జాతికి, ఢిల్లీ పీఠానికి మధ్య జరుగుతున్న పోరాటంలో తెలుగు ప్రజలదే తుది విజయమని ఆయన వ్యాఖ్యానించారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

రాజకీయ సంక్షోభం తీసుకురావడం ద్వారానే అడ్డగోలుగా చేస్తున్న రాష్ట్ర విభజనను అడ్డుకోగలమని కొణతాల పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టినపుడే రాష్ట్ర విభజన ఆగుతుందన్నారు. విభజనకు పూర్తిగా ఫుల్ స్టా‌ఫ్ పెట్టాల్సిన అవసరముందన్నారు.

విభజనపై ప్రజలను మభ్యపెడుతూ ‌ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మోసం చేస్తున్నారని కొణతాల ఆరోపించారు. రాష్ట్ర విభజన సాఫీగా జరిగిపోవడానికి కిరణ్‌ సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ తీర్మానం, బిల్లుపై గందరగోళ ప్రకటనలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమైక్య రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్న నాయకుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరేనని చెప్పారు.