పాదయాత్ర 2 వేల కిలోమీటర్ల పూర్తి సందర్భంగా 14, 15 తేదీల్లో కార్యక్రమం16న జిల్లా కేంద్రాల్లో హోదా నిరసనలు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి
కృష్ణా: వాక్విత్ జగన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటి సాయంత్రంతో కృష్ణాలో పాదయాత్ర పూర్తవుతుందన్నారు. 13న పశ్చిమ గోదావరిలో ప్రవేశిస్తారని, 14న పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఏలూరులో 40 అడుగుల పైలాన్ ఆవిష్కరిస్తారన్నారు. వైయస్ జగన్ 2 వేల మైలురాయి దాటిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 14, 15 తేదీల్లో వాక్విత్ జగన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. అదే విధంగా 16వ తేదీన ప్రత్యేక హోదా కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు.. అనంతరం కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.
మిగిలిన 5 జిల్లాల పాదయాత్ర కీలకం
కృష్ణా జిల్లాలో అశేష జనవాహిన మధ్య వైయస్ జగన్ చేసిన పాదయాత్ర చారిత్రలో నిలిచిపోతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జిల్లాలో పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిందని ప్రజలంతా చెప్పుకుంటున్నారన్నారు. మిగిలిన 5 జిల్లాల్లో జరిగే పాదయాత్ర కీలకంగా ఉంటుందన్నారు.