ఢిల్లీకి పరుగులు ఎందుకు చంద్రబాబూ!
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.గౌతంరెడ్డి నిప్పులు చెరిగారు. ఆత్మగౌరవ యాత్ర నెపంతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చేస్తున్న ఆత్మగౌరవ యాత్రను హఠాత్తుగా ఆపి న్యూఢిల్లీకి ఎందుకు పరుగులు పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డికి బెయిల్ వస్తుందంటేనే చంద్రబాబు హడలెత్తిపోతున్నారని గౌతంరెడ్డి ఎద్దేవా చేశారు. శ్రీ జగన్ బెయిల్ అంశం ప్రస్తావనకు రాగానే ఆయనకు ఢిల్లీ గుర్తుకు వస్తుందని, అలాగే ప్రధానికి లేఖ ఇవ్వాలన్న విషయం కూడా అప్పుడే గుర్తుకు వస్తుందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా చంద్రబాబు ఉద్యమం చేయాల్సింది పోయి ఢిల్లీకి పోతున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు 2008లోనే కేంద్రానికి లేఖ ఇచ్చారని గౌతంరెడ్డి గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు స్వయంగా గొడ్డలి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన ఆరోపించారు. దేశంలో అత్యంత నీచమైన రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు అని నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడిన ఘనత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలోనే ఓ ప్రతిపక్ష నేత ఎన్నడూ ఇలా అధికార పార్టీతో కుమ్మక్కై వ్యవహరించలేదని గౌతంరెడ్డి పేర్కొన్నారు.