హైదరాబాద్, 6 సెప్టెంబర్ 2012 : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ గురువారం ఫీజు దీక్షను ప్రారంభించారు. ఇందిరాపార్క్ సమీపంలోని దీక్షా శిబిరం వద్ద మహానేత వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆమె దీక్షకు కూర్చున్నారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలన్న డిమాండ్తో, వారికి మద్దతుగా విజయమ్మ రెండు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు.
విజయమ్మ దీక్షకు సంఘీభావంగా దీక్ష ప్రాంగణానికి భారీగా విద్యార్థులు చేరుకుంటున్నారు. నేడు, రేపు ఆమె దీక్ష కొనసాగిస్తారు. విజయమ్మ వెంట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.
విజయమ్మ చేపట్టిన ఫీజు దీక్షకు మద్దతుగా కుత్బుల్లాపూర్లోని గండిమైసమ్మ చౌరస్తా నుంచి రెండు వందల వాహనాలపై భారీ ర్యాలీ సాగింది. రంగారెడ్డి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలను శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. షాపూర్నగర్లో వైయస్ విగ్రహానికి పూలమాలలు వేసిన అభిమానులు జై జగన్ నినాదాలతో దీక్షా శిబిరానికి తరలి వచ్చారు. మరోవైపున విశాఖలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ విజయమ్మ ఫీజు దీక్షకు మద్దతుగా విద్యార్థులు దీక్ష చేపట్టారు.