విజయమ్మ సమరభేరికి గుంటూరు సన్నద్ధం

19 Aug, 2013 10:40 IST
గుంటూరు 19 ఆగస్టు 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ చేపట్టనున్న సమరభేరి దీక్షకు గుంటూరు సన్నద్ధమైంది. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయలేనపుడు, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో పరిష్కరించ లేనపుడు రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరుతూ శ్రీమతి విజయమ్మ సోమవారం నుంచి గుంటూరులో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్న సంగతి తెలిసిందే.

గుంటూరులోని ఆర్‌టీసీ బస్టాండ్‌కు సమీపంలో శిబి రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 10.30 గంటలకు దీక్షా ప్రాంగణానికి చేరుకుంటారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.  సర్వమత ప్రార్థనల్లో పాల్గొంటారు.

అనంతరం ‘సమర దీక్ష’ ప్రారంభిస్తారు. విజయమ్మ దీక్షకు మద్దతు తెలిపేందుకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నాయి.  రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించాలని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమం ఉవ్వెత్తున రగులుతున్న తరుణంలో శ్రీమతి విజయమ్మ సమర దీక్షతో పరిస్థితులు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని సామాన్య ప్రజలతో పాటు, రాజకీయ వర్గాలు, జాతీయ మీడియాల్లో ఉత్కంఠ కలిగిస్తోంది. ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలు, అందునా ఒక మహిళ తెలుగు ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ ఆమరణ నిరాహారదీక్ష  చేయాలని నిర్ణయం తీసుకున్న నాటి నుంచే దీనిపై విస్తృతంగా చర్చ సాగుతోంది.

ఏకపక్షంగా, నిరంకుశ వైఖరితో అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేస్తున్నారన్న నిర్ణయం వెలువడిన నాడే సీమాంధ్ర ప్రాంతం అగ్నిగుండంగా మారింది. జూలై 31వ తేదీ మొదలు మూడు వారాలుగా ఉద్యమంతో అట్టుడుకుతోంది. విద్యార్థులు, యువకులు, మహిళలు, ఉద్యోగులు, రైతులు.. అన్ని వర్గాల వారూ ఈ ఏకపక్ష విభజనను నిరసిస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని స్వచ్ఛందంగా రోడ్ల మీదకు వస్తున్నారు. సరిగ్గా ఇలాంటి తరుణంలో శ్రీమతి విజయమ్మ చేయనున్న దీక్షకు సకల వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది.

ఉద్యమానికి మరింత ఊపు రాష్ట్ర ప్రజల హృదయాల్లో కొలువై ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి సతీమణిగా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, అందరికీ సమన్యాయం చేయాలని కోరుతూ ఈ వయసులో కూడా శ్రీమతి విజయమ్మ ఆమరణ దీక్ష చేపట్టనుండటం.. ఇప్పటికే రగిలిపోతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి మరింత ఊపునిచ్చినట్లు అవుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
వాస్తవానికి  అడ్డగోలుగా రాష్ట్ర విభజన జరుగుతోందని తెలిసీ తెలియగానే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయాన్ని ప్రతిఘటించటం మొదలు పెట్టింది. విభజన కసరత్తు జరుగుతుందని తెలిసీ తెలియగానే కేంద్ర హోంమంత్రి షిండేకు శ్రీబమతి విజయమ్మ లేఖ రాశారు. అన్ని ప్రాంతాల ప్రయోజనాలను పరిర క్షించాలని విజ్ఞప్తి చేశారు. అయినా కాంగ్రెస్ పట్టించుకోకుండా ఏకపక్షంగా విభజన చేసే దిశగా ముందుకు వెళ్లింది.

ఈ విషయాన్ని గ్రహించిన వైయస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు జూలై 25న సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం వెలువడటానికి ముందే పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయినా ప్రయోజనం లేకపోవటంతో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి, శ్రీమతి వైయస్ విజయమ్మ తమ ఎంపీ, ఎమ్మెల్యే పదవులను  త్యజించారు. కాంగ్రెస్ మొండిగా ముందుకు వెళుతూ ఉండటంతో పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.

విజయమ్మ దీక్షకు కదలిరండి
శ్రీమతి  విజయమ్మ సోమవారం నుంచి చేపట్టనున్న దీక్షకు వైయస్ఆర్ టీచర్సు ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది. ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరానికి కదలి రావాలని ఫెడరేషన్ కన్వీనర్ ఓబుళపతి, స్టీరింగ్ కమిటీ సభ్యులు జాలిరెడ్డి, శంకరరావు, టి.వి.రమణారెడ్డి, అశోక్‌కుమార్‌రెడ్డి, రియాజ్‌హుస్సేన్, స్వామిరాజ్, అప్పారావు ఆదివారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.