'విచక్షణ మరిచి వైయస్ మీదే విమర్శలా?'
24 Feb, 2013 15:35 IST
గుంటూరు: దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో వచ్చిన పదవులను అనుభవిస్తున్నామన్న విచక్షణ మరిచిపోయిన కాంగ్రెస్ నాయకులు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు రావి వెంకటరమణ నిప్పులు చెరిగారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాదయాత్ర వల్లే కేంద్రం, రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కిందన్న విషయాన్ని ఆయన గుర్తచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎం.సి. శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవంతం కావాలని ఆయన సర్వమత ప్రార్థనలు చేశారు. పెదపలకలూరులో పార్టీ నాయకుడు నూనె ఉమా మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
శ్రీమతి షర్మిల పాదయాత్రతో అధికార, ప్రతిపక్ష పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని రావి వెంకటరమణ శాపనార్థాలు పెట్టారు. ఎన్ని కుట్రలు పన్ని ప్రజలను తప్పుదోవ పట్టించాలనుకున్నా వైయస్ఆర్సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి 2014లో ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా యువజన విభాగం కన్వీనర్ కావటి మనోహర్ నాయుడు మాట్లాడుతూ, మహానేత కుటుంబం పట్ల రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న విశేష ఆదరణను చూసి అధికార, ప్రతిపక్ష పార్టీలకు నిద్రహారాలే కరవయ్యాయన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కొంతదూరం పాదయాత్ర చేస్తూ 'జై..జగన్'...'జోహార్..వైయస్ఆర్'...'షర్మిల నాయకత్వం వర్ధిల్లాలం'టూ నినాదాల చేశారు. మొత్తం 30 కార్లు, ద్విచక్రవాహనాల్లో వారంతా శ్రీమతి షర్మిల పాదయాత్రకు తరలివెళ్లారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా విద్యార్థి విభాగం కన్వీనర్ నర్సిరెడ్డి, పార్టీ రాష్ట్రస్థాయి మైనార్టీసెల్ ఉపాధ్యక్షుడు షేక్ జిలానీ, వైయస్ఆర్సిపి కార్మిక విభాగం నగర కన్వీనర్ గులాం రసూల్, నాయకులు తనుబుధ్ది కృష్ణారెడ్డి, డోక్కు కాటంరాజు, మందపాటి శేషగిరిరావు, దాది శివబాబు, దర్శనపు శ్రీనివాసరావు పాల్గొన్నారు.