బాబు కోసమే జగన్పై లగడపాటి విషం
చంద్రబాబుకు లబ్ధి చేకూర్చాలనే తాపత్రయంతోనే టీడీపీ గెలుస్తుందనే ప్రచారాన్ని లగడపాటి రాజగోపాల్ చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు.
శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి అంటే లగడపాటికి తొలి నుంచే ద్వేషమేనని, అందుకే ఆయనపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. శ్రీ జగన్పై మూడేళ్ల క్రితం నుంచే లగడపాటి విషం కక్కుతూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి ప్రయత్నంగా చంద్రబాబుకు ఉడతాభక్తిగా సాయం చేద్దామని ప్రజాభిప్రాయం పేరిట సీమాంధ్రలో టీడీపీ గెలుస్తుందని లగడపాటి ప్రచారం చేస్తున్నారన్నారు.
రాజకీయ సన్యాసం పుచ్చుకున్నానని ప్రకటించిన లగడపాటి అంతటితో ఊరుకోక అభిప్రాయాల పేరుతో రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ ఎద్దేవా చేశారు. సన్యాసం తీసుకోవడం మాటేమిటో గానీ ఆయన మాత్రం ఒక సన్నాసి అని ఆమె మండిపడ్డారు.