అమరావతి: గుంటూరులో ఇటీవల నిర్వహించిన ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయక ముస్లిం యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని, వివిధ పోలీసు స్టేషన్లకు తిప్పిన ఘటనపై ఈ నెల 4వ తేదీ వైయస్ఆర్సీపీ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు పార్టీ మైనారిటీ నాయకులు మహ్మద్ ఇక్బాల్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సీఎం సభలో ప్లకార్డ్సు ప్రదర్శించిన యువకులను పోలీసులు దాదాపు 30 గంటలపాటు నిర్బంధించి, తీవ్ర వేధింపులకు గురిచేసి, చివరకు టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారన్నారు. ఫిర్యాదులో గానీ, ఎఫ్ఐఆర్లో గానీ పొందుపరచని అంశాలను రిమాండ్ రిపోర్ట్లో చేర్చడం చూస్తే ముస్లిం యువకులపై ప్రభుత్వం ఏ స్థాయిలో కక్షసాధింపు చర్యలకు దిగుతోందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. వారంతా దేశద్రోహానికి పాల్పడ్డారని చిత్రీకరించే కుట్రకు టీడీపీ ప్రభుత్వం తెర తీసిందని, ఈ విషయాన్ని మానవ హక్కుల సంఘానికి వివరిస్తామని ఇక్బాల్ తెలిపారు.