అమరావతి: ప్రత్యేక హోదా పోరు ఉధృత రూపం దాల్చింది. హోదా సాధనే ధ్యేయంగా వైయస్ఆర్సీపీ ఎంపీ పదవులను త్యజించి ఆమరణ దీక్షకు దిగారు. ఎంపీల దీక్షకు సంఘీభావంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైల్ రోకో కార్యక్రమాలకు పార్టీ పిలుపునిచ్చింది. ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం పార్టీ శ్రేణులు చేపట్టిన జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం విజయవంతమైంది. అన్ని జిల్లాల్లోనూ వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జాతీయ రహదారులను దిగ్బంధించారు. ప్రత్యేక హోదా ఆకాంక్షను ప్రతిధ్వనింపజేశారు. ఎక్కడికక్కడ రహదారులపై మానవహారాలు, వంటావార్పు, భిక్షాటన, బైక్ ర్యాలీలు తదితర రూపాల్లో తమ నిరసన తెలియజేశారు. పార్టీ పిలుపుమేరకు బుధవారం ఉదయం నుంచే రైల్రోకోలు ప్రారంభమయ్యాయి.