భరోసా యాత్ర విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
7 Jun, 2016 07:48 IST
వైఎస్సార్సీపీ నేతలు గురునాథరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్రెడ్డి
అనంతపురం : ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతు భరోసా యాత్ర విజయవంతం చేసిన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు జిల్లా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తాడిపత్రి, కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో పర్యటన విజయవంతంగా సాగిందని చెప్పారు. వైఎస్ జగన పర్యటనలో రైతులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారన్నారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన ప్రజా పరిరక్షణ సభ కూడా విజయవంతమైందన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
జిల్లాలో చేపట్టిన చివరి విడత రైతు భరోసా యాత్రకు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను వైఎస్ జగన్ వ్యక్తీకరించారన్నారు. జైలు శిక్ష పడిన వ్యక్తి కదిరిలో వైఎస్ జగన్ కాన్వాయ్ను అడ్డుకోవాలని చూడటం హాస్యాస్పదమన్నారు.
మరోవైపు అనంతపురంలో చంద్రబాబు పేరు పెట్టుకున్న చంద్రదండు నాయకులు కత్తులు పెట్టుకుని అలజడి సృష్టించారన్నారు. ఇదేనా చంద్రబాబు కార్యకర్తలకు నేర్పుతున్న క్రమశిక్షణ అని ప్రశ్నించారు.
ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గంలో జరుగుతున్న నష్టంపై అవగాహన కల్పించేందుకు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పర్యటిస్తుంటే అడ్డుకోవడం ప్రజల గొంతు నొక్కడం కాదా? అని ప్రశ్నించారు. సమావేశంలో కనగానపల్లి జడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ధనుంజయయాదవ్, నాయకులు మహానంది రెడ్డి, అనంతపురం రూరల్, రాప్తాడు మండల కన్వీనర్లు నాగేశ్వరరెడ్డి, బోయ రామాం జనేయులు పాల్గొన్నారు.