సభకు రానీయకుండా టీడీపీ కుట్రలు
నంద్యాల: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు జనాన్ని రానివ్వకుండా చంద్రబాబు సర్కార్ విపరీతమైన కుట్రలు చేస్తుందని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లోని వైయస్ఆర్ సీపీ బహిరంగ సభ ప్రాంగణం వద్ద అంబటి మీడియాతో మాట్లాడుతూ.. పబ్లిక్ మీటింగ్కు ప్రజలను రానివ్వకుండా చంద్రబాబు నీచ చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. డబ్బులిచ్చి మరీ ఆపేస్తున్నారన్నారు. ఓటమి భయంతో టీడీపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతుందన్నారు. కొన్ని వార్డుల్లో భోజనాలు పెట్టి ప్రజలను అక్కడే నిర్భందించారన్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించాలన్నారు. ఏదో విధంగా వైయస్ఆర్ సీపీ మీటింగ్ను ఫెయిల్యూర్ చేయాలని టీడీపీ కుట్ర పన్నుతుందన్నారు. టీడీపీ ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సభా ప్రాంగణానికి వేలాదిగా జనం తరలివచ్చారన్నారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపలేరని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓటరుకు రూ. 10 వేలు ఖర్చు పెట్టి అయినా గెలవాలని బాబు ప్రయత్నిస్తున్నాడని, టీడీపీ ఎన్ని కోట్లు వెదజల్లినా నంద్యాల ప్రజలంతా వైయస్ఆర్ సీపీ వైపే ఉన్నారన్నారు. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు.