ప్రజాధనంతో బాబు ప్రచార ఆర్భాటం
9 Sep, 2017 18:19 IST
* వైయస్ఆర్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తీట్ల వీరయ్య
గుడ్లవల్లేరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఆయన ప్రచార ఆర్భాటాలకు ప్రజల డబ్బును ఖర్చు చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తీట్ల వీరయ్య అన్నారు. శనివారం ఆయన గుడ్లవల్లేరులో విలేకరులతో మాట్లాడుతూ చివరి సాగు భూములకు సాగునీరు పూర్తి స్థాయిలో అందించకుండా బాబు జల హారతులు చేసుకోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. తాగునీరు కూడా వందలాది గ్రామాలకు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నారని చెప్పారు. పుల్లేటి పక్కనున్న ప్రాంతాల్లో కూడా కాల్వల్లో సాగునీరు అందక ఆయిల్ ఇంజన్లతో తోడుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు నీరందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని పట్టించుకోకుండా ప్రజాధనంతో జల హారతులు ఏమిటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో చివరి సాగు భూములకు సైతం నీరు అందించేవారని గుర్తు చేశారు. అలాగే ప్రతి గ్రామానికి తాగునీరు అందించటంలో సఫలీకృతమైనా ఏనాడు ప్రచార ఆర్భాటం చేసుకునేవారు కాదని గుర్తు చేశారు.