కారు రేసింగ్ లో టీడీపీ మంత్రి కుమారుడి పట్టివేత

16 Apr, 2016 09:29 IST

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకులే అంటే.. వారి కుమారులు తండ్రులను మించిపోయి చెలరేగుతున్నారు. విజయవాడలో ఎమ్మెల్సీ బోండా ఉమ కొడుకు కారుతో ఒక కుటుంబం ప్రాణాలు తీస్తే, హైదరాబాద్ లో మంత్రి రావెల కిషోర్ బాబు కొడుకు తప్ప తాగి ఒక అమ్మాయిని చెరబట్టేందుకు ప్రయత్నించాడు. తాజాగా కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి కుమారుడు కార్ రేసింగ్ కు పాల్పడుతూ పోలీసులకు దొరికిపోయాడు. హైదరాబాద్ లో సంపన్నుల నివాస ప్రాంతంగా పేరు పొందిన జూబ్లీహిల్స్ లోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. అక్కడ ట్రాఫిక్‌ పోలీసులు కారు రేసింగ్‌లపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో అతివేగంగా నడుపుతున్న సుజానా కుమారుడు సాయికార్తీక్‌తో పాటు నలుగురు కారు రేసర్లు దొరికిపోయారు.   సాయి కార్తీక్‌ నడుపుతున్న జర్మన్‌ స్పోర్ట్స్‌ కారు నెంబర్‌ ఏపీ09 సీవీ9699 ను సీజ్‌ చేశారు. ఈ కేసుకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం.