ముందస్తు ప్రణాళిక ప్రకారమే

18 Dec, 2015 17:59 IST
అసెంబ్లీలో తెలుగుదేశం సభ్యులు అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే వ్యవహరించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యుల్ని అదే పనిగా దూషించాలని నిర్ణయించారు. అప్పుడు ఆవేశపడి వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడితే ...దాన్ని సాకుగా చూపి సభను స్తంభింప చేయాలని భావించారు.
దీన్ని ముందే ఊహించిన వైఎస్సార్సీపీ సంయమనంతో సబ్జెక్ట్ మీదనే మాట్లాడుతూ వెళ్లారు. సెక్సు రాకెట్ విషయంలో నిందితుల్ని ఎందుకు పట్టుకోవటం లేదని నిలదీశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆడుతున్న దొంగ నాటకాల్ని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ బయట పెట్టే ప్రయత్నం చేశారు. 
దీంతో ఈ పాచిక పారటం లేదని గ్రహించిన టీడీపీ నాయకులు తమ డ్రామాకు పదును పెట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు ఒకడుగు ముందుకు వేసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు అన్నింటికీ వైఎస్ జగన్ కారణం అంటూ తిట్టి పోశారు. సైకో అంటూ సభ్యతకు అందని పదాలు వాడేశారు. అటు సీనియర్ సభ్యుడిగా చెప్పుకొనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ..అదికారం తమ చేతిలో ఉందని,అవసరం అయితే నలిపి పాడేస్తామని హెచ్చరించారు. కొద్ది సేపటికే దాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
మహిళా సభ్యురాలు రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామక్రిష్ణుడు ప్రతిపాదించారు. దాన్ని వెంటనే స్పీకర్ ఆమోదించారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేయగలం అని గోరంట్ల అన్న మాటల్ని అక్షరాలా అమలు చేశారు.