విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అధికార పార్టీ నేతలు ఆకర్శితులవుతున్నారు. నిత్యం ఏదో ఒక జిల్లాలో టీడీపీ నేతలు ఆ పార్టీని వీడి వైయస్ఆర్సీపీలో చేరుతున్నారు. తాజాగా విజయనగరం పట్టణానికి చెందిన ఆయా కాలనీల టీడీపీ నాయకులు 150 మంది వైయస్ఆర్సీపీ నాయకుడు, ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి కొలగట్ల వీరభద్రస్వామి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొలగట్ల మాట్లాడుతూ..నాలుగేళ్లలో రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగాయని మండిపడ్డారు. టీడీపీ పాలనకు విసుగు చెంది వైయస్ఆర్సీపీలోకి రావడం అభినందనీయమన్నారు. అన్ని రంగాలలో ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందన్నారు. జిల్లా నుంచి ప్రజలు వలస వెళ్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందన్నారు. వైయస్ జగన్ను సీఎం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.