తూర్పుగోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. అధికార పార్టీకి చెందిన పలువురు వైయస్ జగన్ పాదయాత్రకు ఆకర్శితులవుతున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రగా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో రాజమహేంద్రవరం నగరానికి చెందిన పలువురు ప్రముఖులు పార్టీలో చేరారు. సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యాన ప్రముఖ వ్యాపారవేత్త పిల్లి సిరిబాల, గౌతమీ జీవకారుణ్య సంఘం మాజీ చైర్మన్ పోలసనపల్లి హనుమంతురావు, మాజీ కార్పొరేటర్ సూరవరపు రాజ్యలక్ష్మి, రామారావు, పెద్ద వెంకటేశ్వర్లు, చెల్లిబోయిన సూర్యనారాయణమూర్తి పార్టీలో చేరారు. వారికి వైయస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రౌతు మాట్లాడుతూ, కొత్తగా పార్టీలో చేరినవారు పార్టీ అభివృద్ధికి తమవంతు సహాయ సహకారాలు అందించాలని, వైయస్ జగన్ను ముఖ్యమంత్రి చేసేంతవరకూ అహర్నిశలూ శ్రమించాలని సూచించారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నక్కా శ్రీనగేష్ రాజమహేంద్రవరంలో వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్ సీపీలో చేరారు.