టీడీపీ కోడ్ ఉల్లంఘన
29 Aug, 2017 10:58 IST
కాకినాడ : కాకినాడ మున్సిపల్ ఎన్నికల పోలింగ్లోనూ టీడీపీ నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. మంగళవారం పోలింగ్ సందర్భంగా టీడీపీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్దే స్లిప్పులు పంపిణీ చేయగా, పోలీసులు అడ్డుకున్నారు. అయితే 14, 15 డివిజన్లలోని పోలీసులతో ఎమ్మెల్యే వర్మ వాగ్వాదానికి దిగారు. బూత్ ఆఫీసులోనే కూర్చొని ఓటు వేయడానికి వచ్చినవారిని ప్రలోభాలతో పాటు భయపెట్టి ఓటు వేయాలంటూ సూచనలు చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు.
మరోవైపు, 4వ డివిజన్ పరిధిలో బీజేపీ అభ్యర్థి తోట నాగలక్ష్మి ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రచారానికి దిగారు. పోలింగ్ బూత్ నం.4/2లో ఆమె ప్రచారం చేస్తున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ఓ మీడియా రాకతో బీజేపీ అభ్యర్థిని పోలీసులు అక్కడ నుంచి పంపేశారు.