నంద్యాలలో వైయస్సార్సీపీ గెలుపుతో టీడీపీ భూస్థాపితం

12 Aug, 2017 18:08 IST
పులివెందుల రూరల్‌: కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్ధి శిల్పా మోహన్‌రెడ్డి భారీ మోజార్టీతో గెలవగానే టిడిపి భూస్థాపితం కావడం తథ్యమని వైయస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర లీగల్‌సెల్‌ జనరల్‌ సెక్రటరీ ఎం.ఓబుళరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి సురేష్‌రెడ్డి, వై.కొత్తపల్లె వైయస్‌ఆర్‌సీపీ నాయకులు విజయ భాస్కరరెడ్డిలు జోస్యం చెప్పారు. శనివారం పట్టణంలోని వైయస్‌.రాజారెడ్డి భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నంద్యాల ఉపఎన్నికలో అక్రమ మార్గంలో గెలవడానికి సీఎం చంద్రబాబు అనేక కుయుక్తులు పడుతున్నారన్నారు. ఎన్నికల ముందు ఆచరణ సాధ్యం కానీ హామిలు ఇచ్చి ఓటర్లును ప్రభావితం చేసి గద్దెనెక్కిన చంద్రబాబుకు నంద్యాల ఓటర్లు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌రెడ్డి నంద్యాలకు ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబును ఉరితీసినా సరిపోదన్నారు. నంద్యాలలో నారాయణ విద్యా సంస్ధల విద్యార్థులచే ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం భావ్యం కాదన్నారు. విద్యార్ధులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన భాద్యత కలిగిన మంత్రి నారాయణ ఈ పనులు చేయించడం సిగ్గుచేటు అన్నారు. కావున మంత్రి నారాయణ తక్షణమే రాజీనామా చేయాలన్నారు. ఎన్నికల రోజు ఏలాంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ కేంద్ర బలగాలు ఏర్పాటు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని వారు కోరారు.