బాబుగారి సొమ్మన్నట్టు రాసిచ్చారు

30 Dec, 2015 17:09 IST
ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక భూదందాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.   దోచుకో తమ్ముడా దాచుకో దండిగా అన్నట్లు చంద్రబాబు బంధువులు, అనుయాయులకు అప్పనంగా భూములు కట్టబెడుతున్నాడు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టమొచ్చినట్లు చెలరేగుతున్నారు. అదేదో బాబుగారి సొమ్మనట్టు  ఖరీదైన ప్రభుత్వ భూములను తన వాళ్లకు కారుచౌకగా రాసిచ్చేస్తూ కొల్లగొడుతున్నారు. 2015లో చంద్రబాబు దోపిడీల్లో కొన్ని మచ్చుతనకలు. 

చంద్రబాబు  బావమరిది నందమూరి బాలకృష్ణ దగ్గరి బంధువుకు చెందిన  విశాఖపట్నం బాట్లింగ్ కంపెనీకి..చంద్రబాబు  అడ్డగోలుగా భూములు దోచిపెట్టాడు. కృష్ణా జిల్లా జయంతిపురంలో 498 ఎకరాలను కారు చౌకగా కట్టబెట్టారు. జగ్గయ్యపేట రైల్వేస్టేషన్ కు ఐదు కి.మీ. దూరంలో ఉన్న ఏపీఐఐసీకి చెందిన 499.93 ఎకరాల భూమిని వీబీసీకి అప్పనంగా ధారాదత్తం చేశారు. రూ. 250 కోట్ల విలువైన భూమిని కేవలం రూ. 4.99 కోట్లకే దోచిపెట్టాడు.

చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ సెజ్ ను అనుకొని ఉన్న అత్యంత విలువైన భూమిని...పచ్చసర్కార్ హీరోమోటోకార్ప్ కు చౌకగా అప్పజెప్పింది.   రూ. 180 కోట్లు పలికే భూమిని కేవలం రూ.6కోట్లకే  కట్టబెట్టారు.  ఎకరా రూ.లక్ష చొప్పున 600 ఎకరాలు కేటాయించారు. 

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు చెందిన మంగల్ ఇండస్ట్రీస్ కు ఇష్టారాజ్యంగా భూములు అప్పగించారు. కడప-తిరుపతి రహదారిలోని కరకంబాడిలో రూ.43.38 కోట్ల విలువైన భూమిని రూ. 4.88 కోట్లకే రాసిచ్చారు. ఎకరా రూ.22.50 లక్షల ధరతో 21.69 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టారు. అక్కడి మార్కెట్ విలువ ప్రకారం ఎకరా రూ.2 నుంచి 2.5 కోట్లు పలుకుతుంది. 

ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజనాను లూటీ చేస్తూ చంద్రబాబు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్నారు. పేదలకు ఇళ్లు, భూపట్టాలు ఇవ్వని చంద్రబాబు అయినవారికి మాత్రం అప్పనంగా భూములను దోచిపెడుతున్నారు.  ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు బనాయిస్తూ అణచే ప్రయత్నం చేస్తున్నారు. ఈవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో భూదందా కొనసాగుతోంది. పేదలను కొట్టి సంపన్నులకు పంచిపెడుతున్న చంద్రబాబు పాపం పండేరోజులు దగ్గర్లోనే ఉన్నాయని పలువురు హెచ్చరిస్తున్నారు.