రావణకాష్టంలా మారిన రాష్ట్రం : కొణతాల

18 Aug, 2013 12:09 IST
ముసునూరు (కృష్ణాజిల్లా):

మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత రాష్ట్రం రావణకాష్టంలా తగలబడిపోతోందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కో ఆర్డినేటర్‌ కొణతాల రామకృష్ణ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన మరణంతో నాయకత్వ సమస్య నెలకొన్నదన్నారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలంలోని వేల్పుచర్ల దళితవాడలో జరిగిన ఓ వివాహ వేడుకకు శనివారం హాజరైన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. డాక్టర్ వై‌యస్ఆర్ మర‌ణించాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందన్నారు.

కాంగ్రెస్ అధిష్టానానికి రాష్ట్రంలో‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి, తెలంగాణ సమస్య మాత్రమే కనబడుతున్నాయని కొణతాల విమర్శించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకే కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై శ్రీ జగన్‌ను దెబ్బతీయడానికి కుట్రలు పన్నుతున్నాయని, రాష్ట్ర విభజన కూడా ఈ కుట్రలో భాగమేనని ఆయన ధ్వజమెత్తారు.