అవినీతిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా

23 Nov, 2015 13:51 IST
అక్రమ జీవోలు..విచ్చలవిడి దోపిడీ
రహస్యంగా జీవోలు తొక్కిపెట్టి వేలాది కోట్లు లూటీ
అయిన వారికి కారుచౌకగా భూములు

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రహస్యంగా జీవోలు తొక్కిపెడుతూ వేలాది కోట్లు లూటీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఖరీదైన భూములను కారుచౌకగా కొట్టేసి..బంధువులు, పార్టీనేతలకు అప్పనంగా   దోచిపెడుతున్నారని మండిపడ్డారు.  చంద్రబాబుకు దమ్మూ ధైర్యం ఉంటే...ప్రభుత్వం సాగిస్తున్న దోపిడీలు, దందాలపై చర్చకు రావాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. చీకటి జీవోలు సహా టీడీపీ సర్కార్ అవినీతి కార్యక్రమాలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. 

మాట్లాడితే తాను నిప్పు, నిజాయితీ పరుడినని చెప్పుకునే చంద్రబాబు...అసెంబ్లీ సమావేశాలు జరిపి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు.  పచ్చనేతల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతామన్నారు.  ఉత్తారంధ్ర, అమరావతి, రాయలసీమ సహా అనేక ప్రాంతాల్లో పేద ప్రజలు, రైతులకు సంబంధించిన వందల కోట్ల విలువైన భూములను లాగేసుకుంటున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ప్రజలకు తెలియకుండా చంద్రబాబు 700 జీవోలు రహస్యంగా ఎందుకు తీసుకొచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జీవోల ముసుగులో దోపిడీ, దొంగతనాలు చేస్తూ రాష్ట్ర ప్రజల డబ్బును లూటీ చేస్తున్నారని ఫైరయ్యారు. 

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 90 శాతం ప్రాజెక్ట్ పనులు అయిపోయాయని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. మిగిలిన పది శాతం పనుల కోసం ..వందలాది కోట్లు అంచనా వ్యయాలు పెంచేసి టీడీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడుతుందన్నారు. తమ అవినీతి దందా కోసం అధికారుల మెడమీద కత్తిపెట్టి మరీ జీవోలు జారీ చేయిుంచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  చంద్రబాబు తాను చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీద బురదజల్లి లబ్దిపొందేందుకు కుట్ర పన్నాతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రం కష్టాల్లో ఉందంటూ బీద అరుపులు అరుస్తూనే..చంద్రబాబు తన హంగూ ఆర్భాటాలు, పబ్లిసిటీ  కోసం  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించిన ప్రతిపక్షంపై ఎదురుదాడులకు దిగుతున్నారన్నారు. ఇతరుల మీద నిందలు వేస్తూ ఎంతకాలం అవినీతి పాలన సాగిస్తారని చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీ సర్కార్ అక్రమాలపై  యువత, మేధావులు అంతా ఆలోచన చేయాలన్నారు.